ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. భారీగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం 10 గంటల కల్లా పార్టీ ప్రతినిధులందరూ సమావేశ మందిరానికి చేరుకోవాలని కేసీఆర్ తెలిపారు. ఈ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర మంత్రులు, రాజ్య సభ, లోక్ సభ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు -చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల మరియు మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరవనున్నారు. ఉదయం 11.05 గంటలకు పార్టీ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించి సభా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సుమారు 11 తీర్మానాలను ఆమోదించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 10 గంటల కల్లా ఆహ్వానితులు అంతా సభా ప్రాంగణానికి చేరుకోవాలని పార్టీ నేతలు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 11.05గంటలకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వేదిక వద్దకు చేరుకుంటారు. పార్టీ పతాకావిష్కరణ, స్వాగతోపన్యాసం అనంతరం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. తీర్మానాల ఆమోదం అనంతరం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది.