కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పై ప్రివిలేజ్ మోషన్
కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు టీఆరెస్ ఎంపీలు. పార్లమెంటరీ నిబంధనలు, లోక్ సభ రూల్ నెంబర్ 222 ప్రకారం ఆయన సభకు పచ్చి అబద్ధాలు చెప్పారని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్సభ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆరోపించారు. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ కింద చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధిని అపహాస్యం చేసే విధంగా సభను తప్పు దోవ పట్టించడంపై టిఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని అనడం… భారత పార్లమెంటరీ వ్యవస్థను అవమానించినట్టేనని అన్నారు. స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ, కేంద్ర మంత్రిత్వ శాఖ మధ్య ఇంత చర్చ జరిగిన అంశంపై అబద్ధం చెప్పడాన్ని రాజ్యాంగ వ్యవస్థను తీవ్రంగా అవమానించినట్టు చూడాలని వారు పేర్కొన్నారు. లోక్సభలో ఆయన స్పందనం తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు.
గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై స్వయంగా ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ రాత పూర్వంగా ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని విస్మరించడం దారుణం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ దిలీప్ కుమార్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 9.08 కంటే తగ్గకుండా గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాయడం నిజం కాదా? అని ఎంపీ నామ ప్రశ్నించారు. 2018, 2019లో ప్రధాని మోడీని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి లేఖను ఇచ్చారని, తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పలుసార్లు కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రాజ్యాంగపరంగా మా హక్కుని సవివరంగా చెప్పి, ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని కోరామని అన్నారు. ఇంత జరిగాక, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. పార్లమెంట్లో అబద్దాలు చెప్పడం చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదని వారు పేర్కొన్నారు.