తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం?
ధాన్యం కొనుగోలు అంశంపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ కాబినెట్ మంగళవారం నాడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం, టీఆరెస్ నాయకులు పోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే లేఖ రాశారు. సోమవారం ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ధాన్యం కొనుగోలు విషయం మీద 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోకపోతే తామే ధాన్యం కొనుగోలు విషయమై తామే ఓ నిర్ణయానికి వస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రేపు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.