Kaleshwaram: కాళేశ్వరంపై సుప్రీం కీలక నిర్ణయం
Supreme Court Crucial Decision on Kaleshwaram: తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న కాళేశ్వరం పై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం పై సుప్రీంకోర్టులో నమోదైన కేసులో తెలంగాణకు ఊరట లభించింది. మూడో టిఎంసి మీద ఇప్పటికే ఉన్న స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. మూడో టిఎంసి కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించవచ్చని గోదావరి బోర్డు, సిడబ్ల్యుసిలకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఇక తుది ఉత్తర్వుల మేరకు అనుమతులు లోబడి ఉంటాయని కూడా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
నష్ట పరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక కాళేశ్వరం మూడో టిఎంసి కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాసరెడ్డి సహా కొందరు రైతులు పిటిషన్ దాఖలు చేశారు. తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డర్ లో సవరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇక రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారని తెలంగాణ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వెల్లడించారు.