వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. దీనికితోడు ఆ పార్టీలోని పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
BRS : వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్(BRS). దీనికితోడు ఆ పార్టీలోని పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC), రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి(Rythu Bandhu Samiti Chairman Palla Rajeshwar Reddy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అలాగే, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ (Chennuru MLA Balka Suman)ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ ప్రజా ఆశ్వీర్వాద ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరిని తామే కాంగ్రెస్ పార్టీలోకి పంపామని.. అందరూ మన దగ్గరికే వస్తారని వ్యాఖ్యాలు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. ‘‘కాంగ్రెసోళ్ల విషయంలో మీరు కూడా దయచేసి ఏమనకండి. వాళ్లు ఊళ్లలో తిరుగుతుంటే మనోళ్లు అదోటి ఇదోటి అంటున్నారు. ఏమనకండి.. వాళ్లు కూడా మనోళ్లే. వెంకన్న రాలేదా.. వాళ్లందరూ మనోళ్లే. మీకు అసలు విషయం చెప్పాలంటే.. మనమే కొందరిని పంపించినం కూడా.. బయట చెప్పొద్దు.. రాజకీయాలు అన్నప్పుడు ఇలాంటివి నడుస్తాయ్.. తెలివి తేటలు వాడాలి కదా’’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు. దీంతో బీజేపీ మరోసారి కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే నంటూ అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది.
బీఆర్ఎస్ మరో నేత, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ను ఇరకాటంలో పడేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతిని ఎదుర్కొంటున్న తరుణంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు మరింత వివాదం రేపుతున్నాయి. జనగామ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కుక్కలను పిల్లులుగా మార్చేందుకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నానని కేసీఆర్ తనతో చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి ఎందుకు చేర్చుకుంటున్నారని సీఎం కేసీఆర్ను తాను ప్రశ్నించినట్లు తెలిపారు. సుస్థిరతను సాధించడానికి వాటిని తీసుకెళ్లాలని ఆయన నాతో అన్నారు. 88 సీట్లు గెలిచామని, తమను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే కుక్కల్లా మొరుగుతారనీ, కానీ తమ పార్టీలోకి తీసుకుంటే పిల్లులుగా మారతారని ఎమ్మెల్సీ అన్నారు. 2018లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్న కొద్ది నెలలకే కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను, ఇద్దరు ఇండిపెండెంట్లను తమ శిబిరంలోకి చేర్చుకుంది బీఆర్ఎస్.
ఈ ఫిరాయింపులతో 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 104కు చేరింది. 2014 ఎన్నికల్లో విజయం సాధించి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. అప్పుడు 63 సీట్లు గెలుచుకుని, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులతో ఆ పార్టీ బలపడింది. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ పల్లా చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి పార్టీలో చేరిన శాసనసభ్యులు, ఇతర నేతలకు బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలు రుచించడం లేదు. ఇది బీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీస్తుందని ఒక వర్గం నేతలు భావిస్తున్నారు.