Vaarahi: పవన్ ‘వారాహి’ పూజకు టైం ఫిక్స్.. ఆరోజే అనుష్టుప్ నారసింహ యాత్ర కూడా!
Pawan Kalyan Kondagattu Visit: ఈ నెల 24న తెలంగాణాలోని కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన నూతనంగా సిద్దం చేసుకున్న రాజకీయ వాహనం ‘వారాహి’కి సంప్రదాయ పూజ కూడా జరిపించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురికాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయట పడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా నమ్ముతారు.
అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారని జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారని అక్కడ పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారని వెల్లడించారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్భం)ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారని, ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారని చెబుతూ జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.