తెలుగు రాష్ట్రాల మద్య మరో కొత్త రైలు ప్రారంభమైంది. మహబూబ్నగర్-విశాఖట్నం ఎక్స్ప్రెస్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
Mahabubnagar-Visakha Train: తెలుగు రాష్ట్రాల మద్య మరో కొత్త రైలు ప్రారంభమైంది. మహబూబ్నగర్-విశాఖట్నం ఎక్స్ప్రెస్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ను షాద్నగర్లో ఆపాలని స్థానికులుకోరుతున్నారని.. ఈ విషయాన్ని రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మహబూబ్నగర్-విశాఖ 12861, 12862 రైళ్ల రాకపోకల వల్ల ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు సులభంగా ప్రయాణాలు చేయవచ్చు. మహబూబ్నగర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలు పాలమూరు నుంచి కాచిగూడ, కాజీపేట్, వరంగల్, విజయవాడ, ఏలూరు, సామర్లకోట, దువ్వాడ తదితర ముఖ్యమైన నగరాలను కలుపుతుందని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది. స్టాప్ ఉన్న ప్రతి కేంద్రంలోనూ ఒక నిమిషం మాత్రమే నిలిచి ఆ తర్వాత బయలుదేరుతుంది. ముఖ్యమైన స్టేజీల వద్ద పది నిమిషాల వరకు ఆగుతుంది. మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. చార్జీలు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే నిర్ణయించారని తెలిపారు.