KTR Challenge: బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్.. ఆ దమ్ముందా అంటూ?
KTR Challenge to BJP: బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక ఏమి చేశామో ప్రతి గ్రామంలో రెండు గంటలు చెప్పే దమ్ము మాకుందని పేర్కొన్న ఆయన మాతోపాటు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయైన ఆయన కేంద్రం ఏ అవార్డులు ప్రకటించినా ఎర్రబెల్లి నాయకత్వం వహిస్తున్న శాఖకు రావడం గర్వకారణమని ప్రశంసించారు. మంత్రి ఎర్రబెల్లి కృషి, అధికారుల పనితీరు వల్లే ఇలాంటి గుర్తింపు లభించిందని కేటీఆర్ అభినందించారు. ఇక గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి పాఠాలు నేర్పిస్తుందని, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎకరాకు కనీసం రెండు రూపాయల లాభం కూడా లేదని పేర్కొన్న కేటీఆర్ బీజేపీ దొంగసొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుడు ప్రభుత్వాలను కూల్చుడే మోడీ పాలన అని విమర్శించారు. ఇక కేవలం మతపరమైన పంచాయతీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప మోడీ అండ్ కో చేసిందేమీ లేదని ఈ సందర్భంగా కేటీఆర్ మండిపడ్డారు. ఇక మోడీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన అంటే ఖరీదైన ప్రధాని అంటూ ఎద్దేవా చేశారు