Kishan Reddy: తెలంగాణ ఆడబిడ్డలు మద్యం వ్యాపారం చేయాలని అడిగారా?
Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం ప్రతినిధులు దశల వారీగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని మేం నీతి మంతులం అని చెప్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజం ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయమని చెప్పారా? అని ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఆడబిడ్డలు మద్యం వ్యాపారం చేయాలని అడిగారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ నడబొడ్డున అక్రమంగా వ్యాపారం చేసి తెలంగాణ పరువు తీశారన్న ఆయన తల దించుకునేలా చేశారని అన్నారు. లిక్కర్ వ్యాపారంలో ఎక్కడా కూడా రాజకీయ నాయకురాలి పేరు కనబడలేదని కానీ తెలంగాణలో మద్యం వ్యాపారం ద్వారా.. ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారని అన్నారు. మద్యాన్ని ప్రధాన అదాయంగా పెట్టుకున్నారని పేర్కొన్న ఆయన అన్నా చెల్లెలు ఇద్దరూ అబద్దం మాట్లాడారని, మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నందుకు ఈడీ నోటీసులు ఇచ్చారని చెబుతున్నారని అన్నారు.
అసలు మహిళా రిజర్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించిన ఆయన మీ ఇంటి పార్టీ అయిన మజ్లిస్ పార్టీని మహిళా బిల్లు కోసం ఒప్పిస్తారా? మహిళా బిల్లును పార్లమెంటులో ఎస్పీ, ఆర్జేడీ కదా అడ్డుకుంది వారితోనే మీరు కలిసి ఎందుకు ముందుకు వెళుతున్నారు? అని ప్రశ్నించారు. ఇక మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే దృష్టి మరల్చేందుకు కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెర లేపింధని, సానుభూతి కోసం చేస్తున్న డ్రామా ఇదని అన్నారు. రాజ్యసభ కు ఒక్క మహిళా ఎంపిని కూడా పంపని బిఆర్ఎస్ కు రిజర్వేన్లపై మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించిన ఆయన ఆర్థిక మంత్రిగా తెలుగు ఆడబిడ్డకు మంత్రి వర్గం లో అవకాశం ఇచ్చారని అన్నారు.
ఈడి ఎవరిని పిలుస్తోంది.. ఏం చేస్తుంది అనేది మాకు తెలియదు, దేశం కోసం మేం పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎలా లింక్ పెడతారు? నీతి వంతులు అయితే, ఎందుకు బుజాలు తడుముకుంటున్నారు ? లక్షల రూపాయలు వి సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు? మిమ్మల్ని టార్గెట్ చెయ్యాల్సిన గొప్ప వాళ్ళు కాదు మీకు మీరు వచ్చి అక్రమ వ్యాపారంతో ఇరుక్కున్నారని అన్నారు. ఎవరు వద్దన్నా కాదన్నా అవినీతికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం పని చేస్తుందన్న ఆయన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉన్న దోషులను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలకు ఉందని అన్నారు. మాకు సంబంధం లేని వ్యవహారం లో మమ్మల్ని ఇరికించి పెట్టారని కేసీఆర్ ప్రెస్ మీట్ లు పెట్టారని ఆయన అన్నారు.