KCR on Agnipath: అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు.. దేశమంతా దళిత బంధు!
KCR on Agnipath: భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం అని జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అయినా కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో మాట్లాడిన ఆయన దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని అయినా కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని అన్నారు. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయిందని ఆతన విమర్శించారు. జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని, చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని కానీ మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మన దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా అని రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు అని కేసీఆర్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చాటలో తవుడు పోసి.. కుక్కల కొట్లాట పెట్టినట్లుందని, డొల్ల మాటలు, కల్ల మాటలతో పొద్దుపుచ్చే పరిపాలన అని కేసీఆర్ విమర్శించారు. దేశ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీనే కారణమని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందని .. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ను తిడుతుందని ఆయన ఆరోపించారు. ఇక అధికారంలోకి వస్తే అగ్నిపథ్ను రద్దు చేస్తామని మేము అధికారంలోక్ వచ్చాక దేశమంతా దళిత బంధు ఇస్తామని అంటూ కీలక ప్రకటనలు చేశారు.