Praveen Kumar: క్వశ్చన్ పేపర్ లీకేజ్ వెనుక కల్వకుంట్ల కవిత.. ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ!
Praveen Kumar: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడం కలకలం రేపగా ఈ అంశం మీద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఉన్నారు, వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్స్ కవితకు అందజేశారని ప్రవీణ్ కుమార్ అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సరైన సమయంలో వాటిని హైకోర్టుకు కానీ, సీబీఐకి కానీ అప్పగిస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని కూడా చెప్పారు. ఇక సిట్ నుంచి డీజీపీ, చీఫ్ సెక్రటరీకి అందే నివేదికలు చివరకు ముఖ్యమంత్రి చేతికి చేరుతాయని, ఈ క్రమంలో బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తారని తనకు ఏమాత్రం నమ్మకం లేదని ఆయన అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని, తన రాజ్యాంగ అధికారాలు ఉపయోగించి ఆర్టికల్ 317 కింద టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని డిస్మిస్ చేయాలని ప్రవీణ్ కోరారు.