టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావట.. చెప్పింది పీకేనే?
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ప్రశాంత్ కిషోర్ గురించి కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనతో చెప్పినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. టీఆర్ఎస్ అధికారానికి దూరమవుతుందనే కేసీఆర్ దగ్గర నుంచి ‘పీకే’ కాంగ్రెస్ చెంతకు చేరుకున్నారని అన్నారు. హైదరాబాద్లోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడుతూ 2008లో కేసీఆర్ తనను కలిసి తెలంగాణకు మద్దతు కోరగా ఇచ్చానని అయితే టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్తా ప్రస్తుతం రూ. 4.12 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారేలా చేశారని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేసేందుకు సిద్ధమయ్యారని ఆయన విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూపంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన పాల్ కుల, మత, కుట్ర రాజకీయ పార్టీలకు స్వస్తి చెప్పి మార్పు తీసుకొద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక మీదట ప్రతి నియోజకవర్గంలో తాను పర్యటిస్తానని తన చారిటీ సంస్థ నుంచి రూ. 7,500 కోట్లు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తామని అన్నారు. పాల్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.