Boga Shravani: బీజేపీలో చేరిన జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్..బోగ శ్రావణి
Boga Shravani: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక తాను జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన డాక్టర్ బోగ శ్రావణి అనంతరం బీఆర్ఎస్ సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధిస్తున్నాడని, మూడేళ్ల పదవీకాలంలో తనను తీవ్ర ఇబ్బందుల పెట్టారని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసి తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించింది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేందర్ లు శ్రావణి ఇంటికి వచ్చి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా శ్రావణి బిజెపి కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె బిజెపి కండువా కప్పుకున్నారు. శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురనుందని తెలిపారు. అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.