Harish Rao Letter: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు లేఖ
Harish Rao Letter: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదని చెబుతూ ఆయన లేఖలో ప్రస్తావించారు. 2014-15లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీ ఎస్ ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు 495 కోట్లను పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్న ఆయన తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని నిర్మల సీతారామన్ కు మరోసారి లేఖ రాశారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా, పొరపాటున మొత్తం సిఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారని, దీంతో తెలంగాణ నష్ట పోయిందన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకు వెళ్ళిందన్నారు. ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రూ. 495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని ఈ విషయంపై అనేక సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశామని, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు పొరబాటున విడుదల చేసిన రూ.495 కోట్ల మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు.