Revanth Reddy:ప్రజలను పట్టించుకోని సీఎంకు జనం మధ్య తిరిగే హక్కులేదు: రేవంత్ రెడ్డి
Revanth Reddy Fire on CM KCR: సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. వర్షాలు తగ్గిన వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి వరద ప్రభావిత జిల్లాల పర్యటనకు వెళ్లారన్నారు. కేసీఆర్ అక్కడికి వెళ్లింది. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికా లేక వరదలకు ఎందరు గల్లంతయ్యారో లెక్కలు వేయడానికా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంలో వరద బాధితుల నుంచి సీఎం కేసీఆర్కు నిరసన సెగ ఎదురైన ఉదంతాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో పాటు కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాలో వీఆర్ఏల నుంచి నిరసన సెగ ఎదురైందన్నారు. కేటీఆర్ను ట్విటర్ పిట్టగా అభివర్ణించిన రేవంత్.. నిన్న మెట్పల్లిలో చెరుకు రైతుల సెగ, ఇవాళ సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తండ్రీకొడుకులకు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, బంగారు తెలంగాణ క్షేత్రంలో ఇదే వాస్తవ పరిస్థితి అని రేవంత్ వివరించారు.
గత రెండు రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఓ సమీక్ష నిమిత్తం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కలెక్టరేట్కు వెళ్లారు. సమావేశం అనంతరం కేటీఆర్ కాన్వాయ్ కలెక్టరేట్ నుంచి బయటికి వెళ్తుండగా.. 50 మంది వీఆర్ఏలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, అలాగే పేస్కేల్ పదోన్నతులు కల్పించాలని నినాదాలు చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ముందు బైఠాయించే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.