కేసీఆర్ కి షాక్..ఆ పథకం అవినీతి పై కేంద్రం విచారణ
తెలంగాణలో ప్రతిష్టాత్మక పథకం అంటూ కేసీఆర్ గొప్పగా చెప్పే మిషన్ భగీరథ పై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. జలజీవన్ కమిషన్ సర్వే ఆధారంగా మిషన్ భగీరథలో జరిగిన కుంభకోణం పై దర్యాప్తు చేయాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దర్యాప్తు అధికారిని కూడా నియమించింది. కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ మిషన్ భగీరథ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విచారణకు ఓ అధికారిని నియమించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకానికి ఏడేళ్లలో రూ. 36 వేల కోట్ల ఖర్చు చేశారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. జల జీవన్ కమిషన్ ఇటీవలే ఈ పథకం అమలు తీరుపై సర్వే నిర్వహించింది. ఈ కమిషన్ సర్వే రిపోర్టు ఇటీవలే కేంద్రానికి అందగా ఆ నివేదిక ఆధారంగా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సగానికి పైగా పాత స్కీమ్ పైపులు, పాత ట్యాంకులు, పాత నల్లాలు, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ భగీరథ స్కీమ్లో వాడుకుని కొత్తవి వేసినట్లుగా బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ స్కీమ్ కు హడ్కో, కమర్షియల్ బ్యాంకుల నుంచి 80 శాతం నిధులు అప్పుగా.. మిగతా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి నిధులు కేటాయించింది. ఈ నిధుల్లో గోల్ మాల్పై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు మిషన్ భగీరథ పథకమే పైపుల కంపెనీల కోసం పెట్టారని.. ఆ పైపుల కంపెనీలు కేసీఆర్ కుటుంబసభ్యులవని చాలా కాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరీ ఈ విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.