BJP MP:బీజేపీ ఎంపీ అర్వింద్పై దాడి.. కారు అద్దాలు ధ్వంసం
Attack on BJP MP Arvind: బీజేపీ యువ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ఆయనపై గ్రామస్థులు దాడికి దిగినంత పని చేశారు. పోలీసులు వారిని అడ్డు కోవడంతో ఎంపీ కాన్వాయ్ అద్దాలను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరద ప్రాంతాల పరిశీలనకు ఎంపీ వస్తున్నారని తెలుసుకున్న ఎర్దండి వాసులు ఆయన ముందు నిరసన తెలిపేందుకు యత్నించారు. తమ గ్రామానికి చెందిన ఓ భూ వివాదాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన అర్వింద్ ఆ తర్వాత దానిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఎంపీ కాన్వాయ్కి అడ్డుగా నిల్చున్నారు. భారీగా చేరుకున్న పొలీసులు గ్రామస్థులను చదరగొట్టి ఎంపీ కాన్వాయ్ని ముందుకు పంపించారు.
అదే సమయంలో అర్వింద్ వెంట వచ్చిన బీజేపీ శ్రేణులు గ్రామస్థులపై దాడికి దిగారన్న వార్తతో వారంతా ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకున్నారు. వరద ప్రాంతాల పరిశీలన ముగించుకుని తిరిగి వస్తున్న ఎంపీ కాన్వాయ్ను గ్రామస్థులు మరోసారి ఆపేశారు. దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎంపీ కాన్వాయ్పై గ్రామస్థులు దాడికి దిగారు. ఈ దాడిలో కాన్వాయ్లోని ఓ కారు రెండు అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో అప్రమత్తమైన పోలీసులు భారీ భద్రతతో ఎంపీని అక్కడి నుంచి పంపిచారు.