ED on Ramachandra Pillai: రామచంద్ర పిళ్లై వాదన చెల్లదు.. ఈడీ షాక్!
ED on Ramachandra Pillai: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన హైదరాబాద్ బేస్డ్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోర్జరీ చేసిందని, బలవంతంగా తన చేత సంతకాలు పెట్టించిందని ఆరోపిస్తూ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక జడ్జి ఎంకె నాగ్పాల్ ఈడీకి నోటీసులు జారీ చేశారు. మార్చి 13లోగా పిళ్లై పిటిషన్పై జవాబును దాఖలు చేయాలని ఈడీని జడ్జి ఆదేశించారు. పిళ్లై కోర్టులో శుక్రవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఎదుట నమోదు చేసిన వాంగ్మూలాలను వాపస్ తీసుకోవడానికి అనుమతించాలని పిళ్లై తరఫు న్యాయవాది కోర్టు జడ్జిని కోరారు. రెండు డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలని ఈడీ తనను ఒత్తిడి చేసిందని, వాటినే తన వాంగ్మూలాలుగా కోర్టులో ప్రవేశపెట్టిందని పిళ్లై ఈ సందర్భంగా ఆరోపించారు. మార్చి 6న పిళ్లైని ఈడీ అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచింది. ఈడీ కస్టడీకి పిళ్లైని న్యాయస్థానం పంపించగా మార్చి 13న పిళ్లై ఈడీ కస్టడీ ముగియనున్నది. అయితే “క్రిమినల్ ప్రొసీజర్ కోడ్” ( సీఆర్పీసీ) 164 కింద నిందితుడు పిళ్ళై ఇచ్చిన వాంగ్మూలం మెజిస్ట్రేట్ ముందు ఇచ్చే వాంగ్మాలంతో సమానమని, గతంలో పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం అధికారుల వత్తిడి మేరకు ఇచ్చానన్న వాదన చెల్లదని ఈడి అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఏమి జరగనుంది అనేది.