Good News: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీ
Booster Dose: దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రకియను ప్రభుత్వం కొనసాగిస్తోంది.కేంద్రం ఇప్పటి వరకు 199.72 కోవిడ్ డోసులను పంపిణీ చేసింది. 18-59 ఏళ్ల వారికి రెండు డోసులు ఉచితంగా పంపిణీ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 10న ప్రికాషన్ డోసుల పంపిణీని ప్రారంభించింది. అయితే.. 18-59 ఏళ్ల వారు ప్రికాషన్ డోస్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుండగా.. 60 ఏళ్లు పైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్లకు ప్రభుత్వం బూస్టర్ డోస్ను అందిస్తోంది. ఐతే కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం, ప్రికాషన్ డోస్పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా ప్రికాషన్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. జులై 15న మొదలై 75 రోజుల పాటు ప్రికాషన్ డోసు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా బూస్టర్ డోస్ను అందించనున్నట్లు తెలిపారు.
ఐసీఎంఆర్, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలింది. 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో 18-59 ఏళ్ల వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ డోసు అందించనున్నారు. ఈ డ్రైవ్ జులై 15న ప్రారంభం కానుంది.