Kushboo: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
Kushboo: కర్ణాటక బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీనిపై బీజేపీ నేత, మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘బీజేపీ అంటే ఇది. తమిళనాడులోని DMK పార్టీలో ఇలాంటి రాజీనామాలు చూస్తామా? ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతిని సహించేది లేదు’ అని ట్వీట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే బీజేపీకి షాక్ కలిగించే ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీఎమ్మెల్యే కుమారుడు రూ.40 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. చెన్న గిరి బిజెపి ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా రూ.6 కోట్లు లెక్కల్లో లేని డబ్బు దొరికాయి. అంతకుముందు ప్రశాంక్ మదల్ టేబుల్పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా వీటితో పాటుగా ఆయన కార్యాలయం నుంచి రూ.1.7 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కర్ణాటక లోకాయుక్త తెలిపింది.