శుక్రవారం అవినాశ్ ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ తెలపడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తిగా మారింది
Ys Viveka case: వైఎస్ వివేకానంద (Viveka) రెడ్డి హత్య (Murder) కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ (Avinash)రెడ్డి సీబీఐ (CBI) ఎదుట హాజరు కానున్నారు. వాస్తవానికి, మంగళవారమే (Tuesday) సీబీఐ అధికారుల ఎదుట విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, తనకు షెడ్యూల్లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూనే, శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు (Notice) జారీచేశారు. పులివెందులలోని ఆయన ఇంటికివెళ్లి, అక్కడున్న వారికి నోటీసు ప్రతులు అందజేశారు. ఓ వైపు ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పిన అవినాశ్ రెడ్డి, ఆ మరుసటి రోజే సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘నా పిటిషన్ను హైకోర్టు వాయిదా వేసింది. ఇంతలోనే సీబీఐ నన్ను విచారణకు పిలిచింది. సీబీఐ విచారణ నుంచి నాకు రక్షణ కల్పించాలి’’ అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడా ఆయనకు చుక్కెదురయింది. మరోవైపు, వివేకా హత్య కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ గత కొద్ది రోజులుగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి విచారణ అత్యంత కీలకంగా మారనుంది. సీబీఐ నోటీసుల మేరకు అవినాశ్రెడ్డి విచారణకు హాజరవుతారా…… మరేదైనా కారణంతో గడువు కోరతారా…..విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటనేదానిపై ఉత్కంఠ నెలకొంది.