Woman Kidnap Case: ఆదిబట్లలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు
Woman Kidnap Case: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్కి చెందిన ఓ యువతి నిన్న కిడ్నాప్నకు గురయ్యింది. మధ్యాహ్నం నుంచి టెన్షన్ పెట్టిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. యువతి కిడ్నాప్నకు గురైన కొద్దిగంటల్లోనే నిందితుడు నవీన్ రెడ్డిని పట్టుకున్నారు. నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. బాధితురాలు వైశాలి సేఫ్గా ఉన్నట్టు తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పింది.
నిందితులను అరెస్టు చేయడానికి ముందు కిడ్నాపైన యువతి తన తండ్రి ముచ్చర్ల దామోదర్రెడ్డికి ఫోన్ చేసింది. తాను సిటీలో ఉన్నానని తెలిపింది. తాను క్షేమంగానే ఉన్నానని.. తన గురించి ఆందోళన చెందవద్దని పేర్కొంది. రాగన్నగూడకు చెందిన వైశాలి బీడీఎస్ పూర్తి చేసింది. తనను ప్రేమిస్తున్నానని నవీన్ రెడ్డి వైశాలి తల్లిదండ్రులకు చెప్పాడు.. అందుకు వైశాలి తల్లి తండ్రులు ఒప్పుకోలేదు..ఈ మధ్యనే
వైశాలి కి నిశ్చితార్థం జరగడంతో భరించలేకపోయిన నవీన్ రెడ్డి.. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం నవీన్ రెడ్డి రెండొందల మంది యువకులతో కలిసి ఆ యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు.
అనంతరం ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్టు బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. కొద్దిగంటల్లోనే దాడి చేసిన నిందితులలో కొంతమందిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. నవీన్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంతమందికోసం గాలిస్తున్నారు.