TS High Court: రాజకీయాలకు కోర్టులు అడ్డా కాదు..హైకోర్టు
TS High Court: రాజకీయ అంశాలు బయట చూసుకోవాలని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు హితవు పలికారు..రాజకీయాలకు కోర్టులు అడ్డా కాదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి కేసును బదిలీ చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ కేసును హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది.
కేసు ఫైల్స్ కోసం అధికారులపై సిబిఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ తరుఫున మాజీ అడ్వకేట్ జనరల్ సీతారామమూర్తి, సీనియర్ న్యాయవాది ఎల్ రవిచంద్ర వాదనలు వినిపించారు. అప్పీల్కు విచారణ అర్హత లేదని, క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి కాని ..హైకోర్టులో ధర్మాసనం విచారణ జరపకూడదన్నారు.
దర్యాప్తును సిబిఐకి ఇవ్వడమే సరైన విధానమని బిజెపి పార్టీ తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపిపై బిఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. బిజెపి దాఖలు చేసిన పిటిషన్ను సింగిల్ జడ్జి కొట్టివేసినప్పటికీ దానిపై అప్పీల్ ఎందుకు చేశారని ధర్మాసనం ఎజిని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది దుష్యంత్ ఢిల్లీలో ఉన్నారని సోమవారం వరకు సమయం ఇవ్వాలని ఆన్లైన్ విధానంలో విచారణ జరపాలని ఎజి కోర్టును కోరారు. సోమవారం మధ్యాహ్నం (నేడు) 2.30 గంటలకు వర్చువల్ విధానంలో విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. కాగా నేడు వర్చువల్ విధానంలో విచారణను చేపట్టనుంది కోర్ట్.
మరోవేపు తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు 37 మంది ఎమ్మెల్యేలు ఇతర రాజకీయపార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరారని, బీజేపీ తరఫు న్యాయవాది కోర్టు వాదనలు వినిపించారు. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను సింగిల్ జడ్జి కొట్టివేసినప్పుడు దానిపై ఎందుకు అప్పీల్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ అంశాలకు హైకోర్టును వేదికగా చేసుకోవద్దని హితవుపలికింది. ఇది రాజకీయాలకు అడ్డా కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.