Jubilee Hills Gang Rape : నిందితులకు షాకిచ్చిన కోర్ట్
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన హైదరాబాద్ లో ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ కేసులో నిందితులకు కోర్టు తాజాగా షాక్ ఇచ్చింది. బుధవారం నిందితులుగా ఉన్న మైనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జువైనల్ జస్టిస్ కోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన రిక్వెస్ట్ మేరకు జువైనల్ జస్టిస్ బోర్డు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టిపారేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, వారిలో ఒకరు మాత్రమే మేజర్. మిగిలిన ఐదుగురు మైనర్లే. అందులో నలుగురు మైనర్లు బెయిల్ మంజూరు కోసం జువైనల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై తాజాగా జువైనల్ జస్టిస్ బోర్డు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నలుగురు మైనర్లు కూడా సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వారి పిల్లలు అని, కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో వీరికి బెయిల్ ఇస్తే, బాధితులతో పాటు సాక్షులను కూడా నిందితుల కుటుంబాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న జువైనల్ జస్టిస్ బోర్డు నిందితులకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మరోవైపు ఐదో మైనర్ కూడా గురువారం జువైనల్ జస్టిస్ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించనున్నట్లు సమాచారం.