Stock Markets: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే
Stock Markets Today Upadate: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు లాభాలతో దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగాయి. యూరప్కు రష్యా గ్యాస్ సరఫరా మళ్లీ ప్రారంభం కాబోతోందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 630 పాయింట్లు లాభపడి 55,398కి చేరుకుంది. నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 16,521 వద్ద స్థిరపడింది.
టెక్ మహీంద్రా 3.61 శాతం లాభపడగా.. టీసీఎస్ 2.89 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.81 శాతం, రిలయన్స్ 2.47 శాతం, ఇన్ఫోసిస్ 2.02 శాతం లాభాలను అర్జించి సెన్సెక్స్ టాప్గెయినర్స్గా నిలువగా.. మహీంద్రా అండ్ మహీంద్రా -1.80 శాతం నష్టాన్ని చవి చూడగా.. సన్ ఫార్మా -0.87 శాతం, కోటక్ బ్యాంక్ -0.48 శాతం, ఏసియన్ పెయింట్స్ -0.46 శాతం, భారతి ఎయిర్ టెల్ -0.4 నష్టపోయాయి.
టెక్ ఎం, రిలయన్స్ టాప్లో కొనసాగాయి. విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతర ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. అలాగే హిందుస్తాన్ యూనిలీవర్లో ఫలితాల జోష్ కనిపిస్తోంది. ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ భారీగా లాభపడుతుండగా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ ఎం, ఐటీసీ మాత్రమే నష్టపోతున్నాయి.