Stock Markets: లాభల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets Today Update: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడినప్పటికీ.. చివరకు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 54,768కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 16,341 వద్ద స్థిరపడింది.
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య చలించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. దీంతో వరుసగా మూడోరోజైన మంగళవారం కూడా లాభాలను నమోదు చేశాయి మార్కెట్లు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, ఆర్థిక సేవల రంగాల్లోని కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. కొన్ని బడా కంపెనీలు సైతం రాణించడంతో నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చి, వాటిని నిలబెట్టుకున్నాయి.
ఇవాళ సెన్సెక్స్లో యాక్సిస్ బ్యాంక్ 2.35 శాతం లాభపడగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.09 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.89 శాతం, టాటా స్టీల్ 1.65 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.63 శాతం లాభపడి టాప్ గెయిర్స్గా నిలిచాయి. మరోవైపు నెస్లే ఇండియా -1.37 శాతం నష్టపోగా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్ -1.14శాతం, సన్ ఫార్మా -0.83 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ -0.65 శాతం, డాక్టర్ రెడ్డీస్ -0.38 శాతం నష్టాన్ని చవిచూసి టాప్ లూజర్స్గా నిలిచాయి.