Stock Markets: లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్లో ఆసియా-పసిఫిక్ సూచీలు మాత్రం మిశ్రమంగా కదులుతోన్నాయి. వరుస నష్టాల మధ్య మార్కెట్లలో ఉపశమన ర్యాలీ కనిపిస్తోంది. దీంతో పాటు 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండువారాల కనిష్టానికి చేరడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం సూచీలకు కలిసివచ్చే అంశం. ఈ పరిణామాల మధ్య ఉదయం ప్రారంభమైన సెన్సెక్స్ 552 పాయింట్ల లాభంతో 52,818 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 15, 721 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో పోలుస్తే రూపాయి మారకం విలువ 78.16గా కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ మాత్రమే నష్టాల్లో కొనసాగుతోండగా.. ఇండస్ఇండ్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి.
మరోవైపు ఈ రోజు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జులై 1 నుంచి మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలు 3,000 రూపాయల వరకు పెంచబోతున్నట్లు తెలిపింది. ముంబయిలో నెక్సాన్ విద్యుత్ మోడల్ కారులో మంటలు రేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు టాటా మోటార్స్ గురువారం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టాటా మోటార్స్ స్పందించింది. టాటా స్టీల్ అనుబంధ సంస్థ అయిన టాటా స్టీల్ మైనింగ్ రోహిత్ ఫెర్రో-టెక్లో 10 వాటాల కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసింది. విండ్-సోలార్ హైబ్రిడ్ రిన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు నిమిత్తం ఏర్పాటు చేయబోయే ఎస్పీవీలో రూ.65 కోట్లకు 26 శాతం వాటా కొనుగోలు చేయాలని నిర్ణయించారు.