Jagan on Roads: రోడ్లను పూర్తిగా బాగు చేయాలి.. జగన్ కీలక ఆదేశాలు!
Jagan Review: ఆర్&బి శాఖపై వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు, పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలని అన్నారు. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని పేర్కొన్న ఆయన రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదని అన్నారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్న ఆయన దీని వల్ల క్రమం తప్పకుండా రోడ్లు మెయింటెనెన్స్ అవుతాయని, నిర్వహణ కూడా సజావుగా, నాణ్యతతో సాగుతుందని అన్నారు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని పేర్కొన్న జగన్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా పూర్తిచేయాలని అన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీని వాడాలని అధికారులు ప్రతిపాదన చేయగా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం, ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందని అన్నారు. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో చేపట్టాలన్న సీఎం, వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తి చేయాలని పేర్కొన్న సీఎం కడప, బెంగళూరు రైల్వే లైన్ పై దృష్టి పెట్టాలి అని కూడా ఆదేశించారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలని ఆయన అన్నారు. ఇంత ఖర్చు చేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు.