YS Avinash Reddy: వివేకా కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట!
YS Avinash Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యే వరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఇక పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రేపు సీబీఐ విచారణకు హాజరు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ న్యాయవాది కోరగా ఆ మేరకు సీబీఐకి లేఖ పెట్టుకోవాలి అని హైకోర్టు సూచించింది. ఇక సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని, సునీత అభియోగాల వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అవినాష్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. వివేకా హత్య అనంతరం ఏడాది వరకు అనుకూలంగా ఉన్న సునీత ఏడాది తర్వాత ఆరోపణలు చేస్తుందని, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీంల పాత్ర పై సీబీఐ విచారణ చేయడం లేదని అవినాష్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు జరగాలని అవినాష్ న్యాయవాది కోరారు. ఇక వివేకా హత్య కేసు డైరీని షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించిన సిబిఐ, 35 మంది సాక్షులు స్టేట్మెంట్లు, 10 డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు కోర్టుకు సమర్పించింది సీబీఐ. స్పాట్ లో దొరికిన లెటర్, ఎఫ్ఎస్ఎల్ నివేదికను సైతం కోర్టుకు సమర్పించింది సీబీఐ.