Tirumala: శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం..రెండురోజులు విఐపి బ్రేక్ దర్శనాలు బంద్
Tirumala: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శ్రీవారిఆలయమ్లో కన్నులపండుగగా జరుగనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్టుకు, ఉత్సవ మార్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ వెల్లడించింది.
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించబోతున్న వేళ ఈ క్రమంలోనే 21, 22 తేదీల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ప్రకటించింది. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ వెల్లడించింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి భక్తులను కోరింది.