ఏపీలో ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు!
ఢిల్లీలో టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని అన్నారు. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు అని అనేక సార్లు మేము చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోమారు స్పష్టం చేసిందని అన్నారు. 48 వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా పెట్టారు ఏమయ్యాయి? ట్రెజరీ కోడ్ ఉల్లంఘించారు అని కాగ్ పేర్కొందని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సొంత కంపెనీ లాగా భావిస్తున్నారని, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారని అన్నారు. నాయకత్వం లేదు, విజన్ లేదు ఒక కంపెనీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కనకమేడల మాట్లాడుతూ పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంకు శాసనసభలో సవరణలు చేయలేరని, ఇదే విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా కొట్టేయగల అధికారం న్యాయస్థానాలకు ఉంది అని ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యాంగాన్ని చట్ట సభలను అపహాస్యం చేస్తున్నాయని అన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రాజ్యాంగ సంస్థలను అపహాస్యం చేయరాదని, ఉదేశ పూర్వకంగా, కుట్రపూరితంగా కోర్టుల మీద ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్న చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాలు, చట్టాలకు చేసిన సవరణలు రాజ్యాంగ పరిధిలో లేకపోతే న్యాయ స్థానాలు కొట్టేయ గలవు, ఇలాంటి సందర్భాలు గతంలో ఉన్నాయని అన్నారు. పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి శాసనసభ సవరణలు చేయటానికి వీలు లేదని ఆయన అన్నారు.