Pawan Kalyan: ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు!
Pawan Kalyan: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద స్పందించారు. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నానన్న పవన్ సందిగ్ధంలో ఉన్నవారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారని అన్నారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అధోగతి పాలు చేస్తున్న తీరును పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసించారని, ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇటువంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందన్న సంగతి, ఈ ఎన్నికల ద్వారా ముందుగానే స్పష్టమైందని పవన్ అన్నారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, విజేతలకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.