RK Roja: బాలయ్య డైలాగులు చప్పట్లు కొట్టుకోవడానికే.. రోజా ఫైర్!
Minister RK Roja Slams Balakrishna: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి రోజా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గులపోటీ నిర్వహించి బహుమతులు ఇచ్చిన మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి ఇలా పండగ చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. చెల్లిగా , హీరోయిన్ గా , ఎమ్మెల్యేగా , మంత్రిగా ప్రతి ఏడాది ఇక్కడ పండగ చేసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. ఇక సంక్రాంతి రైతుల పండుగ , రైతులు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని పేర్కొన్న రోజా వైఎస్ ఆర్ కుటుంబ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు.
బాలకృష్ణ ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్థం కావడంలేదన్న ఆమె బాలకృష్ణ గత ప్రభుత్వం పనితీరు చూసి ఇంకా అదే విధంగా ఎమర్జెన్సీ లాగా ఉంది అనుకుంటున్నాడని, చంద్రబాబు బ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలి అని అని ఆమె అన్నారు. స్క్రిప్టులు రాసిఇచ్చినా మాట్లాడలేని పరిస్థితిలో బాలకృష్ణ ఉన్నారని బావ వలన 11 మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. అసలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ జీవో నెంబర్ 1ని పూర్తిగా చదివారా? అని ప్రశ్నించిన ఆమె జగనన్న ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదం అని, తన అల్లుడు , కూతురు బాగుండాలని తన బావ మెప్పుకోసం ఇలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. అన్ స్టాప్ బుల్లో ఎన్టీఆర్ పై జరిగిన చర్చ పై ప్రజలందరూ ఇది స్ర్కిప్ట్ అని భావిస్తున్నారని, చంద్రబాబు మోసాన్ని కప్పిపుచ్చేలా షో నడిపారని అన్నారు.
ఎవరు చచ్చినా పరవాలేదు .. నా బావ మీటింగ్ జరగాలి … నా బావ కళ్ళలో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారని ఆమె అన్నారు. బాలకృష్ణకు తెలియదా ప్రజల కష్టాలు? ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా అని ఆమె ప్రశ్నించారు. మూడుపంటలు పండే భూమిని ఎవరో స్వామీజీ చెప్పారని బీడు భూమి చేశారు, మహిళా సదస్సుకు రమ్మని నన్ను చంపాలని చూశారని ఆమె ఆరోపించారు. బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు .. పవన్ లాగా రెండు సార్లు ఓడిపోలేదు మీకు ప్రజల కష్టాలు తెలుసు, జీవో నంబర్ వన్ పూర్తిగా చదివితే బాలకృష్ణ తను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారని ఆమె అన్నారు. ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు .. నీతి మాలిన చర్య అని పేర్కొన్న ఆమె సినిమాలో ఎన్ని డైలాగులు చప్పినా చప్పట్లు కొట్చుకోవడానికే తప్ప ప్రజల ఊళ్ళు బాగుపడవని అన్నారు.