Tirumala: వైభవంగా తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు
Tirumala: తిరుమలలో వేడుకగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. శనివారం ఈ తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా, కనుల పండుగగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా తిరుమల కు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం క్యూ లైన్లలో అధిక సంఖ్యలో వేచి ఉన్నారు.
రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్యుద్దీపాలతై అందంగా అలంకరించిన తెప్పపై స్వామి ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లూ విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా సాగింది. కాగా మూడో రోజైన నేడు మలయప్పస్వామి తిరుచ్చిపై స్వర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. కాగా స్వామి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా వస్తున్నారు. తిరుమలలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి.