మంత్రి పదవి వెంట్రుకతో సమానం.. కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు
కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆవిష్కరించారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. విగ్రహావిష్కరణ బహిరంగ సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే నాకు ఇష్టం, మాజీమంత్రి అని పిలవద్దని అన్నారు. మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానమన్న ఆయన ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానని అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని కానీ నాకు జగన్ వెనుక పని చేయడమే ముఖ్యమని అన్నారు. 420 గ్యాంగ్ , చంద్రబాబు దత్త పుత్రుడు ,సొంత పుత్రుడు, రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారని కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని నాని అన్నారు. దేవుడులాంటి వైఎస్ఆర్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందని ఆయన అన్నారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.