Kapunadu Warning: బాలకృష్ణకు కాపునాడు వార్నింగ్.. ఆలోపు క్షమాపణలు చెప్పకుంటే అంతే!
Kapunadu Warning: వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న క్రమంలో నందమూరి బాలకృష్ణ సహా తెలుగుదేశం పార్టీకి కాపునాడు అల్టిమేటం జారీ చేసింది. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారిని ఉధ్ధేశించి నందమూరి బాలకృష్ణ “ఆ రంగా రావు ఈ రంగా రావు” అన్న మాటలని కాపు సామాజిక వర్గం కాపునాడు తీవ్రాతి తీవ్రంగా పరిగణించిందని, గతంలో కూడా రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారని, రాజకీయాలలో విజయం తమకే సాధ్యమనీ “మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు” అన్న మాటలు కూడా కాపుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.
జనసేన పార్టీ లో తిరిగే వారందరూ అలగాజనం అనీ సంకరజాతి జనం అని అన్నమాటలు కాపుల గుండెల్లో గునపాలు దింపాయని పాత విషయాలను కూడా ప్రస్తావిస్తూ అల్టిమేటంలో పేర్కొన్నారు. పై వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ 25వ తేది సాయంత్రం లోపు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పని ఎడల రాష్ట్రంలో ఉన్న స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహం వద్ద కాపు సోదరులందరూ ప్లాకార్డులు ప్రదర్శించి మౌన నిరసన తెలపాలని విన్నపం చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.
అలాగే గతంలో దేవి బ్రాహ్మణులకి సంతకం లేని లేఖ విడుదల చేసినట్లు కాకుండా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సదరు వ్యాఖ్యలకి మన్నించాలని క్షమాపణ కోరుతూ ఇకపై అటువంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇవ్వని ఎడల యావత్ తెలుగు రాష్ట్రాల్లో కీ.శే. వంగవీటి మోహన రంగా విగ్రహాల వద్ధ నిరసన కార్యాచరణ చేపపట్టాలని పేర్కొంది. పై విధంగా నందమూరి బాలకృష్ణ క్షమాపణ చెప్పని ఎడల తెలుగుదేశం పార్టీ నుండి నందమూరి బాలకృష్ణని పది సంవత్సరాల పాటు బహిష్కరించ వలసినదిగా డిమాండ్ చేయడమైనదని, ఈ షరతుకి తెలుగుదేశం తలొగ్గని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ పాద యాత్రని కాపు సామాజిక వర్గం అడ్డుకుంటారని హెచ్చరించారు. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది.