ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ జనసేన ఉద్యమ బాట..
రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేకూర్చింది అని ఉభయగోదావరి జిల్లాల్లో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఏ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని అన్నారు. కౌలుదారు చట్టంలో తప్పిదాలు ఉన్నాయని, రైతు భరోసాకు కులాలు అంటగట్టడం దుర్మార్గం అని అన్నారు. కౌలు రైతులు అల్లాడిపోతున్నారన్న ఆయన ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతులకు జి.వో. ప్రకారం 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద 2 లక్షల రూపాయలు అందిస్తామని వైసిపి నేతలు ఆత్మహత్యలు కాదని మార్చేస్తున్నారని, జి.వో. 102 అమలుకు ఉభయగోదావరి జిల్లాలు వేదికగా జనసేన ఉద్యమం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం నుంచి నెల రోజుల్లో స్పందన రాకపోతే జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కలుసుకుని బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. రైతు స్వరాజ్య వేదిక అందించిన రిపోర్ట్ మేరకు కౌలు రైతుల కష్టాలపై జనసేన ఆందోళన చేస్తుందని, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా ఉద్యమం చేస్తామని అన్నారు. నాడు ఫ్యాన్ కు సంతోషంగా ఓటు వేస్తే నేడు ఫ్యాన్ వేస్తే షాక్ కొడుతుందని, త్వరలో విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఆందోళన చేపడతామని అన్నారు. చెత్త పన్నుతో వేధిస్తూ మళ్ళీ పేదవాడి పై విద్యుత్ ఛార్జ్ లు భారం బాధకరం అని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జ్ లు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజలతో కలిసి జనసేన ఉద్యమం చేపడతామని అన్నారు.