Janasena Anniversary: మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ
Janasena Anniversary: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరిట సభా వేదికను ఏర్పాటు చేస్తామని, జాతి గర్వించే మహానుభావుడు పింగళి వెంకయ్య గారు, స్వతంత్ర సమర సాయుధ పోరాట యోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల త్యాగాలను స్మరించుకునే విధంగా సభ ప్రాంగణం ఉంటుందని తెలిపారు. మార్చి 14వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని పేర్కొన్న ఆయన రాబోయే పది రోజుల్లో సభ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని అన్నారు.