Jana Sena: అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్
Jana Sena Chief Pawan kalyan ask AP Government to help effected Farmers
ఏపీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నష్టపోయిన రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని… ప్రాథమిక అంచనా మేరకు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా తెలిసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారని పవన్ తన లేఖలో ప్రస్తావించారు.. ఈ సమయంలో వడగండ్లతో కూడిన వర్షాలు వారిని మరింత కుంగదీస్తున్నాయని… వీరికి తక్షణ ఆర్థిక సాయంతోపాటు పంట నష్ట పరిహారాన్ని సత్వరమే అందించాలని పవన్ కళ్యాన్ కోరారు.
పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతుల బాధలు
పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతుల బాధలు తన దృష్టికి వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కళ్ళాల మీద పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారని… ఈ దఫా ధర పెరుగుతోందని ఆశపడ్డ రైతులకు ఆవేదనే మిగిలిందని పవన్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని మిర్చి రైతులు సైతం నష్టపోయారని… అదే విధంగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మామిడి, మొక్క జొన్న, పొగాకు రైతులు కూడా దెబ్బ తిన్నారని పవన్ కళ్యాణ్ తన లేఖలో ప్రస్తావించారు.
రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల మీద ఆధారపడ్డ రైతులకు ఈ అకాల వర్షాలు, గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అరటి, మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి లాంటి పంటలు దెబ్బ తిన్నాయి. నెల్లూరు జిల్లాలో వరి రైతులు తమ పంట అమ్ముకొనే సమయంలో వర్షాలతో నష్టాల పాలయ్యారు. ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని ఆదుకొనే విషయంలో ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
పంట నష్టాల గణాంకాలను పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని అధికారులను కోరుతున్నానని పవన్ లేఖలో ప్రస్తావించారు. మా పార్టీ నాయకులకు సైతం క్షేత్ర స్థాయిలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సూచించానని పవన్ కళ్యాణ్ వివరించారు.