Heart Attack: రోజు రోజుకు పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు..తాజాగా మరో యువకుడు
Heart Attack:తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి. ఒకేసారి కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. గత పది రోజుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నాల్గు రోజుల క్రితం హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అది మరచిపోకముందే మరో విషాద సంఘటన జరిగింది.
తాజాగా పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణం పసుమరుకు చెందిన షేక్ ఫిరోజ్17 సంవత్సరాల విద్యార్థి అర్ధరాత్రి రెండు 2 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఎప్పటిలానే కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసిన ఫిరోజ్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో కేకలు వినపడడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా గుండెలో నొప్పి అని చెప్పాడు. తల్లిదండ్రులు హుటాహుటీన అతనిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంత చిన్నవయసులో తమకుమారుడు మృతిచెందడంతో తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగారు.