Bopparaju Venkateswarulu: ఈ నెల 9 నుంచి ఏపీ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ
Bopparaju Venkateswarulu: మా ఉద్యమ కార్యాచరణ ఈనెల 9 నుంచి ప్రారంభిస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యమం మీద మంత్రి బొత్స, సజ్జల ఉద్యోగ సంఘం నేతలతో చర్చించారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇచ్చామని వారికి తెలియజేశామని, కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తి సహకారాన్ని ఇచ్చాయని అన్నారు. పీఆర్సీ రాయితీలను తగ్గించి ఇవ్వడంపై రోడ్డు మీదకు వచ్చామని, మాకు బ్రతకలేని పరిస్థితి తీసుకువచ్చారు కాబట్టే ఉద్యమబాట పడుతున్నామని అన్నారు. ఉద్యోగుల రావాల్సిన బకాయిలు మాకు రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చారని, మాకు రావాల్సిన డబ్బులు రావు.. మేము దాచుకున్న డబ్బులు ఇవ్వరు.. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించరని అన్నారు.
ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లు ఎప్పుడిస్తారో తెలియదని, ఇది ఉద్యమం కాదు ప్రభుత్వం మర్చిపోయిన పనిని తెలియజేస్తున్నామని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచలేదని, ఇస్తున్న టీఏలు వెనక్కి తీసుకోవడం దుర్మార్గమని అన్నారు. స్మార్ట్ ఫోన్ అవగాహన లేని సీనియర్ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వ ఉద్యోగులు శ్రమ దోపిడికి గురవుతున్నారని అన్నారు. ఉద్యోగులు అప్పులు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఉద్యోగుల న్యాయబద్ధమైన రాయితీలు ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఉద్యమం ఆపుతామని స్పష్టం చేశామని అన్నారు.