ఫ్లైట్లో వచ్చి స్నాచింగ్లు.. దుండగుడు అరెస్ట్
హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఫ్లైట్లలో వచ్చి మరీ నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరంలోని ఏ ప్రాంతంలో స్నాచింగ్ చేయాలి. ఎవరిని టార్గెట్ చేయాలని దుండగులు ముందే ప్లాన్ వేసుకొని వస్తున్నారు. ఇదే కాదు స్నాచింగ్ అనంతరం వెంటనే తిరుగు ప్రయాణం కోసం టికెట్లను ముందుగానే బుక్ చేసుకొని రెడీగా ఉంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే యూపి నుంచి నగరానికి వచ్చాడు చైన్ స్నాచర్.
అబ్దుల్లాపూర్మెట్లో బైక్పై నర్సిరెడ్డి కమల దంపతులు వెళ్తుండగా.. మరో బైక్పై వచ్చిన దుండగుడు.. కమల మెడలోని పుస్తెల తాడును లాక్కెళ్లాడు. మహిళ మెడలోని పుస్తెల తాడును ఒక్కసారిగా లాగడంతో మహిళ బైక్పై నుంచి క్రింద పడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వెళ్లి అక్కడి నుంచి ఉత్తర్ప్రదేశ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడు హేమంత్ గుప్తాగా గుర్తించారు పోలీసులు. మరోవైపు బైక్ పైనుంచి క్రింద పడ్డాక ఏం జరిగిందో తనకు గుర్తు లేదన్నారు కమల. తనపై చైన్ స్నాచర్ దాడి చేసినట్లు ఆస్పత్రికి వచ్చాక తెలిసిందన్నారు. స్నాచర్ను తన భర్త వెంబడించినా దొంగ దొరకలేదన్నారు బాధితురాలు. కమలను కొత్తపేటలోని సాయి సంజీవనీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.