Lok Sabha: లోక్సభలో వైసీపీ ఎంపీల మధ్య వాగ్వాదం.. ఇంతకీ ఎవరా ఎంపీలు ?
Argument Between YCP MPs: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, నిధుల దారి మళ్లింపుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతుండగా.. అదే పార్టీకి చెందిన మరో ఎంపీ మార్గాని భరత్ ఆయన ప్రసంగానికి అడ్డుకున్నారు. దీంతో ఇద్దరు సభ్యుల వాగ్వాదం చోటు చేసుకుంది. వీరిని శాంతింపజేసేందుకు స్పీకర్ స్థానంలోని పానెల్ స్పీకర్ రాజేంద్ర అగ్రవాల్ శ్రమించాల్సి వచ్చింది.
మొదట ఏపీ ఆర్థిక పరిస్థితిపై స్పందించిన రఘురామ కృష్ణం రాజు.. మద్యం ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్కు ఏపీ ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన సొమ్ములను కార్పొరేషన్కు మళ్లించడం చట్టవిరుద్ధమని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం ఆదాయాన్ని మళ్లిస్తున్న అంశంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో శ్రీలంక తరహా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని ఇటీవల కేంద్రం చెప్పిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ చర్యలను గమనించాలని ఆయన కోరారు.
ఐతే రఘురామ కృష్ణం రాజు ప్రసంగాన్ని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అడ్డుకున్నారు. ఆధారాలు లేకుండా అనవసర ఆరోపణలు చేయొద్దని ఆయన రఘురామతో వాదించాడు. ఈ నేపథ్యంలో మార్గాని భరత్తో కలిసి వైసీపీ ఎంపీలు రఘురామకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ఎంపీల నినాదాల హోరు పెరగడంతో రఘురామ వారిపైపు చూడగా.. ఆయనతో మార్గాని భరత్ వాగ్వాదానికి దిగారు. రఘురామ కూడా భరత్కు బదులిచ్చారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పానెల్ స్పీకర్ పదే పదే సూచించడంతో వివాదం సద్దుమణిగింది.