Achchennaidu: ఎవరికైనా డబ్బులు వస్తే తీసుకోండి.. కానీ ఓటు వారికే వేయండి!
Achchennaidu: రాష్ట్రంలో ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కి అలవాటైందని, బాబాయి హత్య కేసులో జగన్ సొంత తమ్ముడిని సీబీఐ విచారణకి 10వ తేదీ పిలిచారు సొంత చిన్నాన్నని 12వ తేదీ పిలిచారని అన్నారు. రాష్ట్రంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లని అరెస్టు చేస్తారన్న పరిస్థితులు ఒక వైపు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మరో వైపు ఉందని అన్నారు. రేపో ఎల్లుండో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ఆయన విశాఖలో బోగస్ సమ్మిట్ పెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని, సహజ సంపదను దోచుకుని ముఖ్య మంత్రి లక్షల కోట్లు సంపాదించాడని అన్నారు. సీమెన్స్ ఒప్పందంతో టీడీపీకి, చంద్రబాబుకి సంబంధం లేదని, చంద్రబాబు మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే ఆ బురద వైసీపీ నాయకుల మీదే పడుతుందని అన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల కోసం టీచర్లకి, నిరుద్యోగులకు వైసీపీ నాయకులు ఐదు వేలు ఫోన్ పే చేస్తున్నారని, ఎవరికైనా డబ్బులు వస్తే తీసుకోండి.. అది ప్రజల డబ్బేనని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కి డబ్బులు తీసుకున్నా… న్యాయంగా ధర్మంగా ఆలోచించాలని విజ్ణప్తి చేస్తున్నామని అచ్చెన్న అన్నారు.