ఏపీ డ్వాక్రా మహిళల ఖాతాలకు 1,261 కోట్లు జమ
ఏపీ సీఎం జగన్ ఒంగోలు పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాల(డ్వాక్రా) బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,261 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, అర్హత గల 9.76 లక్షల సంఘాలలోని 1,02,16,410 మహిళలకూ లబ్ది చేకూరనుందని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు రూ.3,615 కోట్లు అందించామని అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద 2020 ఏప్రిల్ లో రూ.1,258 కోట్లు, 2021 ఏప్రిల్ లో రూ.1,100 కోట్లు, తాజాగా రూ.1,261 కోట్లు జమ చేశామని వివరించారు. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి, అక్షరాలా రూ.14,205 కోట్ల మేర చెల్లించకుండా మోసం చేసిందని ఆరోపించారు. దీంతో ఎ-గ్రేడ్, బి-గ్రేడ్ లుగా ఉన్న పొదుపు సంఘాలన్నీ దిగజారిపోయాయని, సి-గ్రేడ్, డి-గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయని అన్నారు. గతంలో 18.36 శాతం ఎన్పీఏలుగా, అవుట్ స్టాండింగ్ జాబితాలో ఉన్న సంఘాలు నేడు కేవలం 0.73 శాతానికి పడిపోయాయని తెలిపారు. అయితే, పొదుపు సంఘాలకు 2019 ఎన్నికల నాటి వరకు ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో ఇవ్వడం ద్వారా అక్కాచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి తప్పించామని వెల్లడించారు.